కరోనా పరిస్థితి దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని మళ్ళీ పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎమర్జెన్సీ సర్వీస్ లు కూడా ఆపేసి, కోవిడ్ హాస్పిటల్ గా కొనసాగించనున్నారు. దీంతో నాన్ కోవిడ్ కేసులను, అవుట్ పేషంట్ (ఓపీ) సేవలను నిలిపివేయాలంటూ ఆసుపత్రి వర్గాలకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు ఇచ్చారు. ఎమర్జెన్సీ కేసుల విషయంలో పేషంట్లను స్థిరీకరించి, బదిలీ చేయాలని సూచించారు. ప్రస్తుతం వివిధ వార్డుల్లో ఉన్న పేషంట్లను సాధ్యమైనంత త్వరగా ఖాళీ చేయించి, ఆసుపత్రిలో అన్ని బెడ్స్ ను కోవిడ్ బాధితులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు.
కోవిడ్ కేసులను అన్ని డిపార్ట్మెంట్స్ లోని అన్ని వార్డుల్లో చేర్చుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. గాంధీలో ఇప్పటికే 450కి పైగా కరోనా పేషెంట్స్ ఉండగా, గురువారం ఒక్కరోజే 150 మంది చేరినట్టు వైద్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కోవిడ్ బాధితులకు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు వైద్య శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 3840 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 15, గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,41,885 చేరింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ