తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణ, శాంపిల్స్ సేకరణకు సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. “ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో 50 వేల కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యవేక్షణలో ప్రత్యేక క్యాంప్ లు నిర్వహించి కరోనా లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేస్తున్నాం. ఈ నెల 16 వ తేదీ నుండి ఇప్పటివరకు 36 వేల శాంపిల్స్ ను సేకరించాం. ప్రస్తుతం 8253 శాంపిల్స్ వివిధ ల్యాబ్స్ లో పరీక్షల కోసం పెండింగ్ ఉన్నాయి. ఒక శాంపిల్ 48 గంటల లోపు పరీక్ష చేయాలి, అప్పటివరకు దానిని నిర్ణీత ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచాలని” చెప్పారు.
“దీంతో ప్రత్యేక క్యాంప్ లు ఏర్పాటు చేసి శాంపిల్స్ సేకరించడం వల్ల ఎక్కువ మొత్తంలో శాంపిల్స్ ల్యాబ్స్ లో జమ అయ్యాయి. వీటిని పరీక్ష చేయకుండా కొత్త శాంపిల్స్ సేకరిస్తే పాత వాటిని నిల్వ చేయడం ఇబ్బంది అవుతుంది, మరోపక్క ఎక్కువ రోజుల తరువాత పరీక్షలు చేస్తే తప్పుగా నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న వాటిని పూర్తి చేయడం, ల్యాబ్స్ ను, కలెక్షన్స్ సెంటర్ లను శానిటైజషన్ చేయడం కోసం రెండు రోజుల పాటు ప్రత్యేక శిబిరాల ద్వారా కరోనా అనుమనితుల నుండి నమూనాల సేకరణ నిలిపివేశాం. కానీ ఆసుపత్రులలో కరోనా లక్షణాలు ఉన్న వారికి యదావిధిగా పరీక్షలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు ఆందోళన చెందవద్దు అని మనవి చేస్తున్నాము. కరోనా పరీక్షలు అవసరం ఉన్న వారికి నిరంతరాయంగా పరీక్షలు చేస్తామని” వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu