తెలంగాణ రాష్ట్రంలో పలు జూనియర్ కాలేజీల గుర్తింపును రద్దుచేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. సరైన అనుమతులు లేకుండా, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ పొందకుండా నిబంధనలు ఉల్లంఘించిన జూనియర్ కళాశాలలపై హైకోర్టు ఆదేశాల మేరకు ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. అనుమతులు లేని మొత్తం 68 కళాశాలలను మూసివేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ ఏప్రిల్ 17, శుక్రవారం నాడు నోటీసులు జారీ చేశారు. ఇందులో నారాయణ సంస్థకు చెందినవి 26, శ్రీచైతన్యకు చెందినవి 18 సహా ఇతర కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుతం లాక్డౌన్ అమలులో ఉన్నందువలన కాలేజీల గుర్తింపు రద్దు చేస్తూ మూసివేస్తున్నట్లు ఆయా కాలేజీల యాజమాన్యాలకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించినట్టు ఇంటర్బోర్డు తెలిపింది.
ముందుగా జూనియర్ కళాశాలల్లో అక్రమాలపై విచారణ సందర్భంగా అనుమతిలేని కళాశాలలపై చర్యలు తీసుకొని ఏప్రిల్ 3వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మార్చి 4వ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగినందు వలన అప్పుడు కళాశాలలు మూసివేస్తే ఆ ప్రభావం విద్యార్థులపై పడుతుందని పేర్కొన్నారు. కళాశాలలు మూసివేస్తే వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని, గుర్తింపు లేని అనేక కళాశాలల్లో మొత్తం 29,808 మంది విద్యార్థులున్నారని చెప్పారు. అగ్నిమాపకశాఖ అందించే దృవీకరణ పత్రం లేని కళాశాలల్లోనూ కూడా పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయని అన్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు ముగిసిన వెంటనే కళాశాలలపై చర్యలు తీసుకునేందుకు అనుమతివ్వాలని ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది. అందులో భాగంగానే నిబంధనలు సరిగ్గా పాటించని కళాశాలలపై ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]