తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు ప్రస్తుతం ఆన్ లైన్ తరగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో కాలేజీల్లో తరగతుల నిర్వహణ ఆలస్యమవుతుండడం, ఇప్పటికే కొంత విద్యా సంవత్సరం కోల్పోయిన నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో సిలబస్ను 30 శాతం మేర తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపగా రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తుంది.
రెండు సంవత్సరాల సిలబస్లో సబ్జెక్టులవారీగా 30% సిలబస్ తగ్గించనున్నామని, ఇందుకు సంబంధించిన ఆదేశాలను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు. జేఈఈ మరియు నీట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో సిలబస్ తగ్గిస్తునట్టుగా పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే 2020–21 విద్యా సంవత్సరానికి సీబీఎస్ఈ బోర్డు, ఏపీ ఇంటర్ బోర్డు కూడా 30 శాతం సిలబస్ కుదిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu