ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్లో ఐఫోన్ల తయారీ చేపట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు టాటా గ్రూప్ ఇప్పటికే తైవాన్ కేంద్రంగా పనిచేసే ‘విస్ట్రన్’ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. బ్లూమ్బెర్గ్ క్వింట్ నివేదిక ప్రకారం.. ఇండియాలో ఐఫోన్ల తయారీ కోసం ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ జాయింట్ వెంచర్ను నెలకొల్పేందుకు టాటా గ్రూప్ ప్రయత్నిస్తోన్నట్లు తెలిపింది. ఈ డీల్ ఇంకా చర్చల దశలోనే ఉందని, ఇంకా షేర్ హోల్డింగ్ల వంటి అంశాలపై ఎటువంటి స్పష్టత లేదని బ్లూమ్బెర్గ్ పేర్కొంది.
ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే, ఐఫోన్లను దేశంలో తయారు చేయనున్న మొదటి భారతీయ కంపెనీగా టాటా అవతరిస్తుంది. కాగా యాపిల్ తన ‘ఫార్ అవుట్’ ఈవెంట్ సందర్భంగా ఐఫోన్ 14 సిరీస్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా భారత్లో ఇప్పటికే యాపిల్ కంపెనీ ఫాక్స్కాన్, విస్ట్రన్, పెగట్రాన్ కంపెనీల భాగస్వామ్యంతో ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 11తో పాటు ఎంపిక చేసిన పలు ఐఫోన్ మోడల్స్ అసెంబ్లింగ్ను చేస్తోంది. ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారీలో చైనాపై ఆధారపడటం తగ్గించాలని దేశీయ పరిశ్రమలకు కేంద్రం ‘మేకిన్ ఇండియా’ పిలుపు ఇవ్వడం తెలిసిందే. దీనికి ముందడుగుగా టాటా తాజా నిర్ణయం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ