తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లో గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. బుధవారం అర్థరాత్రి సమయంలో సోదాలు పూర్తియినట్లు ఐటీ శాఖ తెలిపింది. ఇక సోదాల అనంతరం మంత్రి మల్లారెడ్డికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి నివాసంలో సోదాలు పూర్తయ్యాక మల్లారెడ్డి నివాసం దగ్గర రాత్రంతా హై డ్రామా జరిగింది. మంత్రి మల్లారెడ్డి మరియు ఐటీ అధికారులు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు చేరుకుని పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో హై డ్రామా నెలకొంది.
ఒకవైపు మంత్రి మల్లారెడ్డి, మరోవైపు ఐటీ అధికారి రత్నాకర్ ఇద్దరూ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు రావడంతో సమస్య మొదలైంది. ఈ సందర్భంగా తన కుమారుడు మహేందర్రెడ్డి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి అధికారితోపాటు మరికొందరు వచ్చి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని మంత్రి ఆరోపించారు. తన కుమారుడిని దారుణంగా కొట్టారని, అతనితో అనుచితంగా ప్రవర్తించారని ఐటీ అధికారులపై ఫిర్యాదు చేశారు. తమ వద్ద లెక్కల్లో చూపని డబ్బులేమీ లేవని, అయినా ఐటీ అధికారులు తమను వేధిస్తున్నారని, తప్పుడు వివరాలన్నింటినీ రికార్డుల్లో నమోదు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఐటీ సోదాల్లో ఒక్క రూపాయి కూడా దొరకలేదని, తన కుమారుడి సంతకం కాగితాలను వెంటనే ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు.
అదే సమయంలో మంత్రి మల్లారెడ్డి తీరుపై ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు. తనిఖీలకు సహకరించడం లేదని, ల్యాప్టాప్ను పరిశీలిస్తుండగా తమ వద్ద నుంచి ల్యాప్టాప్ ఎత్తుకెళ్లారని, విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమయంలో మంత్రికి అప్పగించేందుకు మంత్రి అనుచరులు ఐటీ అధికారి రత్నాకర్కు చెందిన ల్యాప్టాప్ను పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు. అయితే మంత్రి అనుచరులను లోపలికి వెళ్లేందుకు సీఆర్పీఎఫ్ సిబ్బంది అనుమతించకపోవడంతో ఆందోళనకు దిగారు. కాగా సోదాల్లో భారీ మొత్తంలో నగదు దొరికినట్లు తెలుస్తోంది. దొరికిన నగదు దాదాపు రూ.8 కోట్లు ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE