తెలంగాణ రాష్ట్రంలో మినీ మున్సిపల్ పోరు సందడి నెలకుంది. రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటుగా సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఏప్రిల్ 30, శుక్రవారం నాడు పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ)లోని లింగోజిగూడ వార్డు సహా పలు మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన వార్డులకు కూడా ఏప్రిల్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి పోలింగ్ కు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారాన్ని ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మంగళవారంతోనే ఎన్నికల ప్రచారానికి తెరపడింది.
ఈ మినీ మున్సిపల్ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. గత పదిరోజులుగా అన్ని చోట్ల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల పరిధిలో ప్రధాన పార్టీల ప్రచారం హోరాహోరీగా జరిగింది. కాగా ఏప్రిల్ 30న జరిగే పోలింగ్ లో ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారో వేచిచూడాల్సి ఉంది. మరోవైపు ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ మే 3వ తేదీన చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ