రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, రైతు సమస్యలు, పలు ఇతర అంశాలపై చర్చించేందుకు తెలంగాణ విపక్ష నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో ఈ రోజు భేటీ అయ్యారు. సీఎస్ ను కలిసిన వారిలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, తదితరులు ఉన్నారు. భేటీ అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఇచ్చిన రూ.1500 సరిపోవని, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా దారిద్య్రరేఖకు దిగువున ఉన్న ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఇటీవల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా నివారణకు తీసుకునే చర్యల్లో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునేలా ప్రభుత్వం వ్యవహరించాలని అన్నారు. అలాగే అన్ని ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలకు అవకాశం ఇవ్వాలని విపక్ష నేతలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వైద్య సిబ్బంది అందరికి పీపీఈ కిట్లు అందించాలని చెప్పారు. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నేతలు డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu