కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలులో సడలింపులు జారీచేసి చేతులు దులుపుకోవడం సమంజసం కాదని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఏప్రిల్ 30, గురువారం నాడు బన్సీలాల్ పేటలో కమాన్ నుండి గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ వరకు 800 మీటర్ల మేర రూ.1.20 కోట్ల ఖర్చుతో చేపట్టిన వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ పనుల కోసం బీహార్, జార్ఖండ్, చత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వారి రాష్ట్రాలకు బస్సులలో వెళ్ళాలంటే 3 నుండి 5 రోజుల సమయం పడుతుందని, కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసి ఉచితంగా వారి రాష్ట్రాలకు చేర్చే బాద్యతను తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
వలస కూలీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బస్సుల్లో తరలించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేయడం తగదన్నారు. రైళ్ళలో వలస కూలీలను వారి రాష్ట్రాలకు చేర్చిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో బస్సులలో కూలీల స్వగ్రామాలకు చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల సౌకర్యార్ధం చేపట్టిన వీడీసీసీ రోడ్డు పనులను నాణ్యతతో నిర్మించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రోడ్డు, పుట్ పాత్ ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాలలో రోడ్డు విస్తరణ చేపట్టాలని అన్నారు. రోడ్డు నిర్మాణంలో నష్టపోయే వారికి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]