తెలంగాణ రాష్ట్రానికి కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ చేరుకుంది. పూణే నుంచి ప్రత్యేక విమానంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ బాక్సులను శంషాబాద్ విమానశ్రయానికి తరలించారు. మొత్తం 3.72 లక్షల వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. శంషాబాద్ నుంచి కోఠిలో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజ్ కేంద్రానికి కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను తరలించారు. రాష్ట్రంలో మొత్తం 1,213 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పంపిణి ప్రారంభమయ్యే తొలిరోజున 139 కేంద్రాల్లో 13,900 మందికి వ్యాక్సిన్ వేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలివిడతలో మొదటగా రాష్ట్రంలో ఉన్న 2.90 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ముందుగా దేశవ్యాప్తంగా జనవరి 16, శనివారం నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపిన కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు కేంద్రప్రభుత్వం ఆర్డర్ పెట్టింది. అందులో భాగంగా కొవిషీల్డ్ మొదటివిడత రవాణాను మంగళవారం ఉదయం సీరం ఇన్స్టిట్యూట్ ప్రారంభించింది. పూణేలోని తయారీ కేంద్రం నుంచి వ్యాక్సిన్ లను ట్రక్కుల్లో పూణే విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ బాక్సులు చేరుకుంటున్నాయి. దేశంలో మొదటి విడతలో 3 కోట్ల హెల్త్ మరియు ఫ్రంట్లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ఆ ఖర్చును కేంద్రప్రభుత్వమే భరిస్తుందని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ