తెలంగాణ కాంగ్రెస్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 స్థానాలు మాత్రమే వస్తాయని, అలాగే ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తుపెట్టుకుంటుందని ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆ పార్టీ సీనియర్ నేతలు పలువురు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. బుధవారం పాదయాత్ర సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ మాట్లాడినా ఉపేక్షించబోమని, అలా వ్య్వవహరించిన వారిపై అధిష్టానం అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్కు పొత్తు ఉండదని వరంగల్ బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీకి నష్టం కలిగేలా ఎవరూ మాట్లాడవద్దని నేతలందరికీ ఆదేశాలిచ్చామని, బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని ఎంత పెద్ద నాయకుడు మాట్లాడినా సహించేది లేదని స్పష్టం చేశారు. పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా నాయకులు ప్రవర్తించరాదని, అయినా ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఏ సీట్లలో ఏ అభ్యర్థులు పోటీ చేస్తారో ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన, సొంతంగా మెజారిటీ దక్కించుకుంటామని, ఇక పొత్తుల ప్రసక్తి ఎక్కడిదని ప్రశ్నించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE