బీజేపీ ప్రభుత్వం గాంధీల కుటుంబ గౌరవాన్ని తగ్గించే కుట్ర చేస్తోందని, దీనిలో భాగంగానే వారి కుటుంబంపై కేంద్రం అక్రమ కేసులు పెట్టిందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఆందోళనలో పాల్గొన్న రేవంత్ ఈ సందర్భంగా మీడియానుద్దేశించి ప్రసంగించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిందని, భారతీయుల వాణి వినిపించిందని, దీనికి భయపడి అప్పట్లో బ్రిటీషర్లు ఈ పత్రికను నిషేధించారని రేవంత్ తెలిపారు.
అయితే అనంతర కాలంలో దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని, బలహీన వర్గాల తరపున తన గొంతుక వినిపించడానికి పత్రికను మళ్లీ పునరుద్దరించాలని నిర్ణయించారని, అప్పటికి ఈ పత్రిక నష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ రూ. 90 కోట్లు ఇచ్చిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిపై 2015వ సంవత్సరంలో ముగిసిన విచారణను మోదీ సర్కార్ మళ్లీ తెరపైకి తెచ్చిందని, ఇది గాంధీల కుటుంబాన్ని వేధించడానికేనని, ఆ కుటుంబం పరువు, ప్రతిష్టలను దెబ్బతీయటానికేనని విమర్శించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వమైన సోనియా, రాహుల్ గాంధీలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, అసలు ఇందులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. కేంద్రం తీరుని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించటానికి వారు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కేసులో బీజేపీ నాయకులూ గాంధీలపై ఆరోపణలు నిరూపించలేరని రేవంత్ రెడ్డి అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ