తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వీడింది. ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లో కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. బుధవారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు శనివారం రాత్రి సమయానికి ముగిసింది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై ఆయన విజయం సాధించారు.
ఈ స్థానంలో మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 70 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ అనంతరం పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొత్తం 1,98,639 ఓట్లు వచ్చినట్లు తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపును ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓట్లు, రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపి మొత్తం 1,49,005 ఓట్లు సాధించారు. ఇక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించిన సంగతి తెలిసిందే. పార్టీ అభ్యర్థుల విజయంతో తెలంగాణ భవన్ వద్ద నాయకులు, కార్యకర్తల కోలాహలంతో సందడి వాతావరణం నెలకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ