తెలంగాణలో గత కొన్నిరోజులుగా మునుగోడు ఉపఎన్నికపై కొనసాగిన ఉత్కంఠ వీడింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో హోరాహోరీగా పోరాడిన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో చివరకు తిరుగులేని విధంగా టీఆర్ఎస్ పార్టీ పైచేయి సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10 వేలకుపైగా మెజార్టీతో గెలుపొందారు. మునుగోడులో కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి మొత్తం 15 రౌండ్లలో 2, 3, 15వ రౌండ్లు తప్ప అన్నింటిలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధిక్యత సాధిస్తూ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. దీంతో 2014 తర్వాత మునుగోడులో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ జెండా తమ జెండాను ఎగురవేసింది. టీఆర్ఎస్ పార్టీ నాయకుల విస్తృత ప్రచారం, తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలే, హోరాహోరీ పోరులో కూడా ఇలాంటి విజయానికి దోహద పడ్డాయని పార్టీ కీలక నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు మునుగోడు గతంలో కాంగ్రెస్ సిట్టింగ్ సీటు అయినప్పటికీ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కొంతమేరే ప్రభావం చూపగలగగా, పార్టీ డిపాజిట్ కోల్పోయింది.
.
మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరిన నేపథ్యంలో వచ్చిన ఈ ఉపఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంతో తుది ఫలితాల కోసం ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూశారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పక్క ప్రణాళికతో పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయడం, ప్రత్యేకమైన పోల్ మేనేజ్మెంట్ తో టీఆర్ఎస్ పార్టీ అద్భుత విజయాన్ని దక్కించుకుంది. నోటిఫికేషన్ వెలువడ్డాక జరిగిన ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా చండూరులో ఒక సభ జరగగా, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి మునుగోడు నియోజకవర్గంలో తమకు కేటాయించిన చోట ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వచ్చిన ఉప ఎన్నికల్లో గెలుపు సాధించే ఆనవాయితీని టీఆర్ఎస్ పార్టీ మరోసారి కొనసాగించింది. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘనవిజయంతో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి, నృత్యాలు చేస్తూ స్వీట్స్ పంచుకున్నారు. టీఆర్ఎస్ ఇకపై భారత్ రాష్ట్ర సమితిగా (బీఆర్ఎస్) మారుతుందని ప్రకటించిన తర్వాత జరిగిన మునుగోడు ఉపఎన్నికలో ఘనవిజయంతో, బీఆర్ఎస్ ఘనంగా మొదలయిందని పార్టీశ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై మంత్రి కేటీఆర్ ఈ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE