తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ప్లీనరికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి రెండు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో జరుగుతున్న ఈ ప్లీనరీని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం నాడు హైదరాబాద్ లోని మాదాపూర్ హెటెక్స్లో జరగనున్న ఈ ప్లీనరీకి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి 6 వేల మంది పార్టీ ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ ప్లీనరీలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా సీఎం కె.చంద్రశేఖర్ రావును మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పాటుగా అనేక రాష్ట్ర, జాతీయ అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. అనంతరం పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు ప్రణాళికలపై నాయకులు, పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
హైటెక్స్ లో ప్లీనరీ వేదికను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. వేదికపై రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆసీనులు అయ్యేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ప్లీనరీకి హాజరయ్యేవారికి ప్రత్యేక పాస్లు జారీ చేసి, డ్రెస్ కోడ్ కూడా తప్పనిసరి చేశారు. పురుషులు గులాబీ చొక్కాతో, మహిళలు గులాబీ రంగుచీర ధరించి రావాలని పార్టీ ఆదేశించింది. ఇక వేదికపై వరంగల్ లోని కాకతీయ తోరణం, నగరంలోని కేబుల్ బ్రిడ్జి, పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల లోగో, తెలంగాణ తల్లి, సీఎం కేసీఆర్ బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అదేవిధంగా ప్లీనరీలో పార్టీ ప్రతినిధులకు పసందైన భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. శాఖాహార, మాంసాహారంకు సంబంధించి మొత్తం 33 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో హైదరాబాద్ నగరమంతా గులాబీమయంగా మారింది. నగరంలో భారీగా ఫ్లెక్సీలు, తోరణాలు, పార్టీ జెండాలు, కటౌట్స్ ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ