కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అక్టోబర్ 30న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు తమ అభ్యర్థుల గెలుపుకై ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున ప్రచారానికి టీఆర్ఎస్ కీలక నేత, రాష్ట్ర మంత్రి హరీశ్ రావు నేతృత్వం వహిస్తున్నారు. అలాగే గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సహా పలువురు మంత్రులు, పార్టీ నాయకులు కీలకంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రి హరీశ్ రావు ఆదివారం జమ్మికుంట మండలం, వెంకటేశ్వర పేట్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఇక బీజేపీ అభ్యర్థి అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఆదివారం వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించగా, ఆయన తరపున మాజీ ఎంపీ, బీజేపీ హుజురాబాద్ ఉప ఎన్నికల ఇంచార్జీ ఏపి జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బొడిగె శోభ సహా పలువురు పాల్గొన్నారు. అలాగే పార్టీ అభ్యర్థి ఈటలకు మద్దతుగా రాష్ట్ర బీజేపీ కీలక నాయకులు ప్రచారం కొనసాగిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు పోటీలో ఉండగా టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహా పలువురు పార్టీ నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. హుజురాబాద్ లో ముఖ్యంగా ప్రధాన పార్టీల మధ్యే త్రిముఖ పోరు నెలకుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఉపఎన్నికలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తూ ప్రచార వ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. నాగార్జునసాగర్ తర్వాత రాష్ట్రంలో మళ్ళీ ఉపఎన్నిక జరుగుతుండడంతో ప్రజల్లో కూడా ఆసక్తి నెలకుంది. అక్టోబర్ 30న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ