టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని హైదరాబాద్ సిటీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయమే జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి. అయితే, పోలీసులు హిమంతపై కేసు నమోదు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా హిమంత వ్యాఖ్యలను తప్పుబట్టిన నేపథ్యంలో.. తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో.. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈక్రమంలో రేవంత్ రెడ్డి స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముందు ధర్నాకు సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తగా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ నివాసం చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఇంటిచుట్టూ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. రేవంత్ బయటకు వెళ్ళటానికి వీలులేని విధంగా చర్యలు చేపట్టారు. కాగా, పోలీసుల వైఖరిపై రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ