తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 32 రోజులుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ నవంబర్ 5, మంగళవారం అర్ధరాత్రి కల్లా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని డెడ్ లైన్ ప్రకటించిన నేపథ్యంలో అఖిలపక్షం నేతలతో కలిసి ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతు రావు, ఇతర పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. సమావేశమనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసినా కార్మికులు చెక్కుచెదరలేదని, ఇదే పోరాటాన్ని ఇకపై కూడ కొనసాగిస్తామని అన్నారు.
తమ డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించేంత వరకు కార్మికులు ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తారని చెప్పారు. ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం ప్రకారం చేసేది కాదు. ఆర్టీసీలో 31 శాతం కేంద్ర వాటా ఉందని, సంస్థలో మార్పులు చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఆర్టీసీని తీసేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. కార్మికులెవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్మికులు విధుల్లో జాయిన్ అవ్వడం లేదు. ఈ రెండ్రోజుల్లో వెళ్లిన వారు కూడ వెనక్కి వస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 20 మందికి పైగా ఆర్టీసీ కార్మికులు చనిపోతే ప్రభుత్వం తరపున ఏ ఒక్కరు కూడా సానుభూతి తెలపలేదు, ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేయలేదు. కానీ మానవతా దృక్పథంతో తాత్కాలిక ఉద్యోగులు డీఎంపై దాడి చేయడాన్ని జేఏసీ ఖండిస్తుందని తెలిపారు. ఎన్ని డెడ్లైన్లు పెట్టినా డిమాండ్లకు పరిష్కారం లభించేంత వరకు సమ్మె యథావిథిగా కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు.
[subscribe]