ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 5, మంగళవారం నాడు వైద్య, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు, ఆస్పత్రుల్లో నిర్వహించబోయే నాడు–నేడు కార్యక్రమంపై చర్చించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో దాదాపు 45 వేల పాఠశాలలు బాగుచేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఆ తరువాత దశలో జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐలు, ఇతర గురుకుల పాఠశాలలు, వాటి హాస్టళ్లను కూడా బాగుచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పాఠశాలలో కాంపౌండ్వాల్, ఫర్నీచర్, ఫ్యాన్లు, టాయిలెట్స్ ఇతర అన్ని రకాల మౌలిక సదుపాయాలను కూడ కల్పిస్తామని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, ఆళ్లనాని, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నవంబర్ 14 నుంచి ‘నాడు-నేడు’ కార్యక్రమం ప్రారంభమవుతుందని సీఎం జగన్ తెలిపారు. వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. తర్వాత సంవత్సరం నుంచి 9వ తరగతిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని, ఈ కార్యక్రమంలో భాగంగా స్కూళ్లలో 9 రకాల పనులు చేపడుతున్నామని అన్నారు. స్కూళ్లు ప్రారంభం కాగానే యూనిఫామ్స్, బూట్లు, పుస్తకాలు ఇవ్వాలని, విద్యార్థులకు సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా జనవరి నెలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. నాడు-నేడు కార్యక్రమం కింద స్కూళ్లలో పాటు ఆస్పత్రులను కూడ బాగుచేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని, డిసెంబర్ 15 నుంచి 510 రకాలకు పైగా మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
[subscribe]