తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 26 రోజులుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 30, బుధవారం నాడు ఆర్టీసీ పరిరక్షణకై ‘సకల జనభేరి’ పేరుతో సభను నిర్వహిస్తున్నారు. ముందుగా సరూర్నగర్ మైదానంలో భారీ స్థాయిలో సభ నిర్వహించాలని భావించిన, హైకోర్టు విధించిన పరిమితులు, సూచనలతో ఇండోర్ స్టేడియంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన ఈ సభ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో సహా, మొత్తం 26 డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొసగిస్తున్నారు. 26 రోజులుగా సమ్మె సాగుతున్నా, ప్రభుత్వం నుంచి అనుకున్న స్పందన రాకపోవడంతో సమ్మెను మరింతగా ఉధృతంగా మార్చే చర్యల్లో భాగంగా ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు తెలంగాణలోని విపక్ష పార్టీలన్నీ మద్దతిచ్చాయి. ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజి రెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, వి.హనుమంతు రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి, సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి, న్యూడెమొక్రసీ నేత పోటు రంగారావు, భాజపా నేతలు వివేక్, జితేందర్ రెడ్డి, పలువురు నాయకులు, విమలక్క, ప్రజా సంఘాల నాయకులు, ఇతర జేఏసీ నాయకులు తదితరులు ఈ సభకు హాజరయ్యారు.
[subscribe]