చైనా దేశాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కోవిడ్-2019 (కరోనా వైరస్) ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ భారత్లోనూ వెలుగు చూసింది. కరోనా వైరస్ లక్షణాలతో దేశంలో రెండు కేసులు నమోదైనట్లు మార్చ్ 2, సోమవారం నాడు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇటలీ దేశం నుంచి ఢిల్లీ వచ్చిన వ్యక్తిలో కరోనా వ్యాధి లక్షణాలు గుర్తించినట్లు తెలిపారు. అలాగే దుబాయ్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన ఐదుగురికి కోవిడ్-19 పరీక్షలు జరపగా వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. వీరిద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించి పరీశీలనలో ఉంచామని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కరోనా కేసు నమోదు కావడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఉన్నతాధికారులు, పలు ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా సోకిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా, ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సపై వారితో చర్చిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
[subscribe]