తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ మలుపు చోటుచేసుకుంది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం వెళ్లారు. జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసంలో ఆయనతో భేటీ అయిన కేటీఆర్, ఆయన్ను సాదరంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ భేటీతో జగిత్యాల పట్టణం ఒక్కసారిగా గులాబీమయంగా మారింది.
జగిత్యాలలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS భేటీ
ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ pic.twitter.com/YHygEioDpx
— BRS Party (@BRSparty) April 9, 2026
కేసీఆర్ – జీవన్ రెడ్డి మధ్య ప్రత్యేక అనుబంధం
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు, జీవన్ రెడ్డికి మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహాన్ని, పరస్పర గౌరవాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ ఎప్పుడూ జీవన్ రెడ్డిని గౌరవిస్తారని చెబుతూ గతంలోని రెండు కీలక సంఘటనలను వివరించారు:
-
బోర్నపల్లి బ్రిడ్జి మంజూరు: 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన తొలి సభలో.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డికి స్వయంగా మైక్ ఇచ్చి మాట్లాడమని కేసీఆర్ కోరారు. అప్పుడు జీవన్ రెడ్డి బోర్నపల్లి బ్రిడ్జి గురించి అడగ్గా, కేసీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా అక్కడికక్కడే రూ. 70 కోట్లు మంజూరు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు.
-
నిజాం షుగర్స్ బాధ్యతలు: అసెంబ్లీలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని జీవన్ రెడ్డి పోరాడుతుంటే.. ప్రభుత్వం నుంచి రూ. 300 కోట్లు ఇచ్చేందుకు తాము సిద్ధమని, అవసరమైతే జీవన్ రెడ్డే దానికి చైర్మన్గా ఉండి నడిపించాలని నిండు సభలో కేసీఆర్ ఆఫర్ ఇచ్చారని కేటీఆర్ వెల్లడించారు.
నిబద్ధత కలిగిన నాయకుడు
2014 ఎన్నికల ముందే జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ, ఆయన తన నిబద్ధతతో కాంగ్రెస్లోనే కొనసాగారని కేటీఆర్ కొనియాడారు. ప్రజా సమస్యలపై, ముఖ్యంగా రైతుల గొంతుకగా అసెంబ్లీలో ఆయన పోరాడే తీరు స్ఫూర్తిదాయకమన్నారు. ఇప్పుడు ఆయన తమ పార్టీలోకి రావడం తెలంగాణ ప్రయోజనాలకు, బీఆర్ఎస్ బలానికి ఎంతో దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
జగిత్యాలలో గులాబీ జోరు
కేటీఆర్ రాక సందర్భంగా జగిత్యాల శివారులో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. భారీ బైక్ ర్యాలీతో జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్న కేటీఆర్కు కార్యకర్తలు నీరాజనాలు పట్టారు. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది.






































