ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో కొత్త పింఛన్లు మంజూరు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రభుత్వ సేవలను నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ 10 రోజుల్లో పింఛన్ కార్డు, పది రోజుల్లోనే రేషన్ కార్డులు అందిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ ప్రకటన తర్వాత మొత్తం 1,28,281 మంది గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పింఛన్లకు దరఖాస్తు చేసుకోగా, అన్ని అర్హతలు పరిశీలించి కొత్తగా మొత్తం 96,568 మందిని పింఛన్లకు అర్హులుగా నిర్ణయించారు. ప్రకటించిన విధంగానే కేవలం పది రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం వీరికి పింఛన్లు మంజూరు చేసింది. కాగా శనివారం నాడు వీరందరికి పింఛను కార్డుల పంపిణీ చేస్తున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్తగా ఎంపికైన 96,568 మందికి పింఛను మంజూరు పత్రంతో పాటు పింఛన్ కార్డు, పింఛన్ పుస్తకం, లబ్ధిదారునికి సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖలను పంపిణీ చేయనున్నారు. జూన్ మొదటివారంలో 1,10,104 మందికి పింఛన్లు మంజూరు చేయగా, కొత్తగా మంజురైనా 96,568 మందితో ఒక్క జూన్ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం 2,06,672 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్లయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 9.44 లక్షలకు చేరుకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu