టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్టు ఈ రోజు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించాడు. “కెరీర్ మొత్తం మీరు చూపిన మద్దతుకు, ప్రేమకు నా ధన్యవాదాలు. ఈ రోజు 19.29 గంటల నుంచి నేను రిటైర్ అయినట్లుగా పరిగణించండి’’ అని ఎంఎస్ ధోనీ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. గతంలోనే ధోని టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. గత కొంతకాలంగా ధోని రిటైర్మెంట్ వార్తలు వస్తున్నప్పటికీ, మరికొంతకాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడని అభిమానులు భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ రోజు రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడంతో క్రీడాభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ధోనీ చివరిసారిగా 2019 లో జరిగిన వరల్డ్ కప్లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ లో ఆడాడు. తన సారధ్యంలో భారత్ జట్టును 2007 లో ఐసీసీ టీ-20 వరల్డ్ కప్, 2011లో ఐసీసీ వరల్డ్ కప్, 2013 లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిపి ధోని చరిత్ర సృష్టించారు.
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ధోని నిలిచారు. తన సారథ్యంలో ఎన్నో సంచలన రికార్డులు నమోదయ్యాయి. తన 16 సంవత్సరాల ఘనమైన కెరీర్ కు ధోని ముగింపు పలికాడు. ధోనీ రిటైర్ అవుతున్నట్టు ప్రకటించడంతో భారతజట్టుకు ధోని చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రముఖ క్రికెటర్లంతా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
మహేంద్ర సింగ్ ధోని గణాంకాలు:
వన్డేలు:
- ఆడిన వన్డేలు: 350
- పరుగులు: 10773
- సెంచరీలు: 10
- అర్ధసెంచరీలు: 73
- అత్యధిక స్కోర్: 183*
టెస్టులు:
- ఆడిన టెస్టులు: 90
- పరుగులు: 4876
- సెంచరీలు: 6
- అర్ధసెంచరీలు: 33
- అత్యధిక స్కోర్: 224
టి-20 లు:
- ఆడిన టి-20 లు: 98
- పరుగులు: 1617
- అర్ధసెంచరీలు: 2
- అత్యధిక స్కోర్: 56
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu