ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు రాష్ట్రంలో మహిళల సంక్షేమం, సాధికారతే ధ్యేయంగా మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అమలులో భాగంగా “వైఎస్ఆర్ ఆసరా” పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 8.71 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 87,74,674 మంది మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా లబ్ది జరగనుంది. స్వయం సహాయక సంఘాల్లోని 87,74,674 మంది మహిళల పేరుమీద బ్యాంకుల్లో ఉన్న రూ.27,168.83 కోట్ల రుణాన్ని నాలుగు విడతలగా నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేయనుంది. అందులో భాగంగా తొలి విడతగా ఈ రోజు రూ.6,792.20 కోట్లను జమ చేశారు. ఈ డబ్బులను ఏ విధంగా ఖర్చు చేసుకోవాలనే నిర్ణయాన్ని కూడా మహిళలకే వదిలేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. వ్యక్తిగత అవసరాలకు లేదా వ్యాపారాలకు ఉపయోగించుకోవచ్చని, ఎలాంటి షరతులు లేవని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఎన్నికల నాటికి ఉన్న రుణాలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చామని, ఆ నేపథ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి మహిళల సంక్షేమానికి, వారికీ లబ్ది కలిగించేలా ప్రవేశపెట్టిన పథకాల గురించి సీఎం వివరించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలకు ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu