ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో ఒకేసారి 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి ఏపీ ప్రభుత్వం రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం రెండు విడతల్లోనే వీరందరికీ పక్కా ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని సీఎం వైఎస్ జగన్ ఈ రోజు ప్రారంభించారు.
రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవారు ఎక్కడా ఉండకూడదు:
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవారు ఎక్కడా ఉండకూడదని అన్నారు. పేదవారి సొంతిళ్లు కల నిజం చేస్తున్నామని, పండగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేస్తున్నామని పేర్కొన్నారు. ‘‘175 నియోజకవర్గాల్లో మొదటి దశలో గృహ నిర్మాణాలు చేపడుతున్నాం. తొలి విడతలో రూ.28,084 కోట్లతో 15.60 లక్షల పక్కాగృహాల నిర్మాణం చేపడుతున్నాం. వచ్చే ఏడాది జూన్ 22 కల్లా తొలివిడత గృహ నిర్మాణాల పనులు పూర్తి చేస్తాం. రెండో దశలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతాం. రెండు దశలు కలిపి రూ.50,940 కోట్లతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాం. పీఎంఎవైతో అనుసంధానం చేసుకుని గృహ నిర్మాణాలు చేపడుతున్నాం. మొత్తం 17 వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మిస్తున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ