కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నవంబర్ 22 నుంచి భారత్ తొలిసారిగా డే/నైట్ టెస్టు ఆడబోతున్న సంగతి తెలిసిందే. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే పింక్ బాల్ డే/నైట్ టెస్టుపై క్రీడాభిమానులు మంచి ఆశక్తి కనబరుస్తున్నారు. ఇరు జట్ల ఆటగాళ్ళతో పాటు మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు ప్రస్తుతం ఈ టెస్టు మ్యాచ్ గురించే చర్చించుకుంటున్నారు. కోల్కతా డే/నైట్ టెస్టుకు అభిమానుల నుంచి మంచి స్పందన లభించడం సంతోషంగా ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐదు రోజుల మ్యాచ్లో మొదటి నాలుగు రోజులకి టికెట్లన్నీ అయిపోయాయని చెప్పారు. ఈ మ్యాచ్ కు సంబంధించిన మస్కట్స్ను సౌరభ్ గంగూలీ ఇటీవలే ఆవిష్కరించాడు. ఈ చారిత్రక డే/నైట్ టెస్టు మొదటి రోజున బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య అతిథిలుగా హాజరవుతున్నారు.
పింక్ బాల్ టెస్టులు అభిమానులను కచ్చితంగా అలరిస్తాయని భారత మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ తెలిపారు. అయితే టెస్టు క్రికెట్ కు ఆదరణ పెంచేందుకు డే/నైట్ టెస్టులు ఒక్కటే పరిష్కారం కాదని, క్రీడాభిమానులను స్టేడియాలకు రప్పించాలంటే అవసరమైన మౌలిక సదుపాయాలను చాలా వరకు మెరుగుపర్చాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తరహాలో ఖచ్చితమైన ప్రణాళికతో, టెస్టు క్యాలెండర్ను భారత్ లో కూడ అమలు చేయాలని చెప్పారు. మరో వైపు భారతజట్టు నవంబర్ 19, మంగళవారం నాడు కోల్కతాకు చేరుకుంది, ఇరు జట్ల ఆటగాళ్లు పింక్ బాల్ తో నెట్స్ లో తీవ్రంగా సాధన చేస్తున్నారు.