గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఆదివారం నాడు ట్విట్టర్ వేదికగా సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ “ఈరోజు గుంటూరు జిల్లా కాకాణిలో జరిగిన దుర్ఘటన ఎంతో దురదృష్టకరం. విద్యార్థిని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశిస్తున్నాను. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది” అని తెలిపారు. అలాగే బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.10 లక్షలు సాయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి సుచరిత సోమవారం ఉదయం రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, సీఎం ప్రకటించిన విధంగా రూ.10 లక్షల చెక్ ను రమ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.
అనంతరం హోం మంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ, రమ్య హత్య ఘటన అత్యంత బాధాకరమన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగానే నిందితుడని అరెస్ట్ చేశామని, నిందితుడిని ఒక్క రోజుల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. రమ్య కుటుంబసభ్యులకు అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున అండగా ఉంటుందని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్ సూచించారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపేక్షించేది లేదని అన్నారు.
మరోవైపు ఈ హత్య కేసులో నిందితుడు శశికృష్ణను పోలీసులు సోమవారం మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, గత 6 నెలల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో శశికృష్ణకి, రమ్యతో పరిచయం ఏర్పడిందని చెప్పారు. అప్పటి నుంచే రమ్య చదువుతున్న కాలేజ్ వద్ద కలుస్తూ, ఆమెని ప్రేమిస్తున్నానని శశికృష్ణ వేదిస్తున్నట్టు తేలిందన్నారు. ప్రేమించడానికి రమ్య నిరాకరించడంతోనే శశికృష్ణ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని చెప్పారు. మహిళలపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో ఏర్పడుతున్న పరిచయాల పట్ల మహిళలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ