వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలన్న తీర్మానాన్ని కేరళ అసెంబ్లీలో ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఏఏకు వ్యతిరేకంగా తమతో చేతులు కలపాలని 11 భాజపాయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ జనవరి 3, శుక్రవారం నాడు ఒక లేఖ రాసారు. ఈ లేఖలో లౌకికవాదం మరియు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బంగాల్, బిహార్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులతో సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజయన్ ఈ లేఖను పంపించారు. సీఏఏ, జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ), జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్పీఆర్)లకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఈ లేఖలో ప్రత్యేకంగా వివరించారు.
సీఏఏపై దేశంలోని కొన్ని వర్గాల ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయని, భారత రాజ్యాంగానికి కీలకమైన ప్రాథమిక సిద్ధాంతాలను కాపాడే దిశగా అన్ని వర్గాల ప్రజలు ఒక్కటిగా పోరాటం చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయని, వాటికి అనుగుణంగా రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోవచ్చని చెప్పారు. ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా వెలువడిన విషయాల్లో ఆ ప్రత్యేక అధికారాలను రాష్ట్రాలు తప్పక వినియోగించుకోవాలని ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు.
[subscribe]