మరికొన్ని రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మురంగా నిర్వహిస్తున్నాయి. దీంతోపాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రజాదరణ ఉన్న ప్రముఖులను పార్టీలలో చేర్చుకుంటున్నాయి. వీరిలో పలువురు ఇతర పార్టీలలోని నేతలు కాగా.. మరికొందరు సినీ రంగానికి సంబంధించిన వారుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా కన్నడ కంఠీరవ దివంగత రాజ్కుమార్ కోడలు, ప్రముఖ కన్నడ (శాండల్వుడ్) స్టార్ హీరో శివరాజ్కుమార్ భార్య గీతా రాజ్కుమార్ కాంగ్రెస్లో చేరారు. శుక్రవారం ఆమె బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా తన భార్య గీత కాంగ్రెస్లో చేరడాన్ని నటుడు శివరాజ్కుమార్ సమర్థించారు. తన సతీమణితో కలిసి ప్రచారానికి కూడా వెళతానని ఆయన ప్రకటించారు.
ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో శివమొగ్గ జిల్లాలోని సొరబ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న తన సోదరుడు మధు బంగారప్ప తరఫున గీత ప్రచారం చేయనున్నారు. మధు బంగారప్ప ఒక సంవత్సరం క్రితం జేడీఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. అయితే మరో సోదరుడు కుమార బంగారప్ప ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉండటం విశేషం. ప్రస్తుతం ఆయనే ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరో విశేషం ఏంటంటే.. గీతా రాజ్కుమార్కు రాజకీయాలు కొత్తేమీ కాదు. ఆమె ఎవరో కాదు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప కూతురే. గీతా శివరాజ్కుమార్ గతంలో జేడీ(ఎస్)లో ఉండేవారు. ఆమె 2014 లోక్సభ ఎన్నికల్లో జేడీ(ఎస్) అభ్యర్థిగా బరిలోకి దిగి బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప చేతిలో ఓడిపోయారు. అయితే ఎన్నికల ముంగిట గీత కాంగ్రెస్లో చేరడం, అభ్యర్థుల తరపున ప్రచారాన్ని నిర్వహించడం ఆ పార్టీలో కొత్త జోష్ నింపుతోంది. ఇక ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల తరుపున మరో అగ్ర నటుడు సుదీప్ ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE