ఆగస్టు 5, 2019న జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో పాటుగా జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2019 ను కూడా ఆమోదించడంతో అక్టోబర్ 31, 2019 నుంచి ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్మూ కశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా (యుటిలు) విభజించబడింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా జమ్మూ కశ్మీర్ లో కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. అనంతరం ఆంక్షలను దశలవారిగా తొలిగించుకుంటూ వస్తున్న కేంద్రం తాజాగా ఇంటర్నెట్ సేవలను సైతం పాక్షికంగా పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని పరిస్థితులను సమీక్షించేందుకు జనవరి 18 నుంచి 24 వరకు జమ్మూ కశ్మీర్ లో కేంద్రమంత్రుల పర్యటించనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
జమ్మూ కశ్మీర్లో 36 మంది కేంద్రమంత్రులు పర్యటించనున్నారు. ఆ ప్రాంతంలోని వేర్వేరు జిల్లాల్లో ఒక్కో కేంద్ర మంత్రి రెండు రోజుల పాటు పర్యటిస్తారు. అందుకోసం కేంద్ర హోంశాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. కేంద్ర మంత్రుల పర్యటన గురించి తెలియజేస్తూ జమ్మూ కశ్మీర్ ప్రధాన కార్యదర్శి బివిఆర్ సుబ్రహ్మణ్యంకు హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వ చేపడుతున్న పథకాలు, ఆర్టికల్ 370 రద్దు వల్ల కలిగే ప్రయోజనాలు, ఇతర ప్రధాన అంశాల గురించి మంత్రుల బృందం ఆ ప్రాంత ప్రజలకు వివరించనుంది. రేపు జరగబోయే మంత్రిమండలి భేటీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా, ఈ పర్యటనకు సంబంధించి ఇతర కేంద్రమంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
[subscribe]