తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించగా, మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. మంత్రి ఎర్రబెల్లి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ విధుల్లో చేరనున్నారు. గతంలో పనిచేసిన స్థానాల్లోనే వారు విధులు నిర్వహించవచ్చని, అయితే దీనికి ముందుగా వారందరూ డీఆర్డీవోల దగ్గర రిపోర్ట్ చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ