తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఐదుగురు సమాచార హక్కుచట్టం కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి 10, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కట్టా శేఖర్రెడ్డి, ఎం.నారాయణరెడ్డి, గుగులోతు శంకర్నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమీర్లను సమాచార హక్కుచట్టం కమిషనర్లగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముందుగా రాష్ట్రంలో సమాచార కమిషనర్ల ఎంపికకు సంబంధించి సీఎం కేసీఆర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. సీఎం కేసీఆర్, మజ్లిస్ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి ప్రశాంత్ రెడ్డిలతో కూడిన కమిటీ ఫిబ్రవరి 9, ఆదివారం నాడు ప్రగతి భవన్లో భేటీ అయ్యారు.
అనంతరం సీఎం కేసీఆర్ అధ్యక్షతన నియామక కమిటీ ఎంపిక చేసిన పేర్లను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు పంపించారు. సోమవారం నాడు ఆ జాబితాకు గవర్నర్ ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్గా రాజాసదారాం, సభ్యునిగా బుద్ధా మురళి కొనసాగుతుండగా చట్ట ప్రకారం మరో ఎనిమిది మంది కమిషనర్లను తీసుకునేందుకు అవకాశమున్న నేపథ్యంలోనే కొత్త సభ్యులను నియమించినట్టుగా తెలుస్తుంది.
[subscribe]