ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్-2022ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క 12వ విడత నిధులను కూడా ప్రధాని మోదీ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 8 కోట్లకుపైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు రూ.16000 కోట్లకు పైగా నిధులను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ కింద 12వ విడత కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.2000 చొప్పున జమ కానున్నాయి. ఈ 12వ విడతతో లబ్ధిదారులకు ఈ పథకం కింద బదిలీ చేయబడిన మొత్తం నిధులు రూ. 2.16 లక్షల కోట్లకు పైగా చేరింది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర రసాయన మరియు ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రులు శోభా కరంద్లాజే, కైలాష్ చౌదరి మరియు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా, తదితరులు పాల్గొన్నారు
ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఎటువంటి దళారుల జోక్యం లేకుండా పీఎం కిసాన్ పేరుతో కోట్లాది రైతు కుటుంబాలకు మరో విడతగా రూ.16,000 కోట్లు విడుదల చేశామని చెప్పారు. దీపావళికి ముందే రైతులకు ఈ విడత డబ్బు అందడంతో అనేక ముఖ్యమైన వ్యవసాయ పనులకు సహాయపడతాయన్నారు. ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి రూ.2 లక్షల కోట్లకు పైగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడిందని, దేశంలోని 85 శాతం కంటే ఎక్కువ మంది రైతుల్లో ఉన్న చిన్న రైతులకు ఇది చాలా పెద్ద మద్దతు అని అన్నారు. ఈ సందర్భంగా దేశంలోని లబ్ధిదారులైన రైతు కుటుంబాలందరికి ప్రధాని అభినందనలు తెలిపారు.
మరోవైపు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 600 ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను (పీఎంకేఎస్కే) కూడా సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే వన్ నేషన్-వన్ ఫెర్టిలైజర్ పథకం కింద భారత్ యూరియా బ్యాగ్లను ప్రధాని ప్రారంభించారు. అగ్రి స్టార్టప్ కాంక్లేవ్ మరియు ఎగ్జిబిషన్ను, ఎరువులపై ఇ-మ్యాగజైన్ ‘ఇండియన్ ఎడ్జ్’ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY