మునుగోడు ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో నియోజకవరంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ప్రజాశాంతి’ పార్టీ అధ్యక్షుడు, మునుగోడు బరిలో నిలిచిన కేఏ పాల్ పోలింగ్ కేంద్రాల వద్ద హల్ చల్ చేస్తున్నారు. ఒక కేంద్రం నుంచి ఇంకో కేంద్రానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. మునుగోడులో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతోందని, అయితే ప్రజలు ఈసారి మార్పు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తాను ఒక్కడినే ఉన్నానని, తన తరపున బూత్ ఇంచార్జీలు కూడా లేరని, తెలిపిన పాల్, సాయంత్రం లోపు దాదాపు 100 పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని నిర్ణయించుకున్నానని, అందుకే ఇలా రన్ చేసుకుంటూ వెళ్తున్నానని వివరించారు.
ఈ సందర్భంగా చేతివేళ్లకు ఉంగ్లు ధరించి పోలింగ్ కేంద్రాల్లోకి ఎలా వెళ్తారని? మీడియా అడిగిన ప్రశ్నకు కేఏ పాల్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఎన్నికల్లో తనకు కేటాయించిన ‘ఉంగరం’ గుర్తుని తాను ప్రదర్శించడం లేదని, ఆలా అయితే టీఆర్ఎస్ పార్టీ గుర్తు ‘కారు’ అని, మరి వాళ్ళు పోలింగ్ కేంద్రాల వద్దకు కారులోనే వస్తున్నారు కదా? అని ఎదురు ప్రశ్నించారు. అలాగే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లపై కేఏ పాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సంస్థానారాయణపూర్లో టీఆర్ఎస్ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా పోలింగ్ బూత్ల లోపలకు వెళ్తున్నారని, పోలీసులు స్పందించాలని కోరారు. అలాగే ప్రధాన పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని, వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల డబ్బులు కోట్లలో దొరికాయని, వారిని ఎందుకు డిస్ క్వాలిఫై చేయడం లేదని కేఏ పాల్ ప్రశ్నించారు. ఇక ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE