స్వతంత్ర భారతదేశపు మొదటి ఓటరు అయిన శ్యామ్ శరణ్ నేగి కన్నుమూశారు. ఆయన వయస్సు 106 సంవత్సరాలు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నౌర్ జిల్లా కల్పాలోని తన నివాసంలో శరణ్ నేగి శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. శరణ్ నేగి ఇప్పటివరకు 34 సార్లు ఎన్నికల్లో ఓటు వేశారు. నవంబర్ 12న జరగనున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా నవంబర్ 2వ తేదీన మొదటిసారిగా పోస్టల్ బ్యాలెట్ని ఉపయోగించడం ద్వారా శరణ్ నేగి 34వ సారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన జీవితంలో ఇప్పటివరకు నేగి ఎప్పుడూ కూడా ఓటు వేయకుండా లేడని అధికారులు పేర్కొన్నారు.
ముందుగా స్వతంత్ర భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగాయి. అయితే దేశంలోని ఇతర అన్ని ప్రాంతాలలో 1952 జనవరి-ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించగా, హిమాచల్ ప్రదేశ్లో మాత్రం శీతాకాల, మంచు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఐదు నెలలు ముందుగానే 1951, అక్టోబర్ 25న ఎన్నికలు జరిగాయి, దీంతో 1951లో కిన్నౌర్ పరిధిలోని కల్ప గ్రామంలో అక్టోబర్ 25న మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ముందుగా ఓటువేసిన శరణ్ నేగి, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఓటు వేసిన మొదటి వ్యక్తిగా నిలిచారు. 1951 నుండి 2021లో జరిగిన మండి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికల వరకు కూడా తన గ్రామంలోని పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసేందుకే నేగి ఆసక్తి చూపేవారని, ఓటు వేసే అవకాశాన్ని అతను ఎప్పుడూ వదులుకోలేదని తెలిపారు. మరోవైపు నేగి అంత్యక్రియలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది.
హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ ట్వీట్ చేస్తూ, “స్వతంత్ర భారతదేశపు తొలి ఓటరు మరియు కిన్నౌర్కు చెందిన శ్యామ్ శరణ్ నేగీజీ మరణవార్త విని చాలా బాధపడ్డాను. తన విధిని నిర్వహిస్తూ ఆయన నవంబర్ 2వ తేదీన 34వ సారి అసెంబ్లీ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఈ జ్ఞాపకం ఎప్పుడూ భావోద్వేగంగా ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE