కర్నూలు నగర శివారులోని కట్టమంచి రామలింగా రెడ్డి పాఠశాలలో చదువుకున్న సుగాలి ప్రీతిపై లైంగిక దాడి, ఆపై హత్య చేయబడిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2017లో ఈ ఘటన జరగగా బాధితులకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలో బాధితురాలి తల్లి, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు న్యాయం కోసం పలు విధాలుగా పోరాటం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం ఈ ఘటనపై స్పందించి సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును అధికారంగా సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 18న కర్నూలు పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్ ను సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ కూతురిపై అతి దారుణంగా జరిగిన అఘాయిత్యాన్ని సీఎంకు వివరించారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ ఈ కేసును సీబీఐకి అప్పగించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 27, గురువారం నాడు సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ జీవో 37 తో ఉత్తర్వులు జారీ చేశారు.
[subscribe]