తెలంగాణ రాష్ట్రంలో యువ వైద్యురాలు దిశ హత్యకేసు నిందితుల ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దిశ నిందితుల ఎన్కౌంటర్ కు సంబంధించి న్యాయ విచారణ కోసం సుప్రీం కోర్టు గతంలోనే కమిషన్ ఏర్పాటు చేసి, ఆరునెల్లలోగా నివేదిక సమర్పించాలని కోరింది. ఈ క్రమంలో దిశ నిందితుల కుటుంబాలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 28, శుక్రవారం నాడు విచారణ జరిగింది. ఒక్కో కుటుంబానికి రూ.50లక్షలు పరిహారం ఇవ్వాలని, ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిందితుల కుటుంబాలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది.
దిశ ఎన్కౌంటర్ కు సంబంధించి ఇప్పటికే న్యాయ విచారణ నిమిత్తం కమిషన్ వేశామని, ఈ సమయంలో పిటిషన్ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేశారు. ఏదైనా చెప్పాలనుకుంటే న్యాయ విచారణ కమిషన్ను సంప్రదించవచ్చని, ఆ స్వతంత్రతను కల్పిస్తున్నామని అన్నారు. అలాగే న్యాయం జరగలేదని భావిస్తే నిందితుల కుటుంబాలు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి సూచనలతో పిటిషన్ను ఉప సంహరించుకున్నట్టు దిశ నిందితుల కుటుంబాలు తరపు న్యాయవాది వెల్లడించారు.
[subscribe]