భారత అభిమానులు ముద్దుగా మాస్టర్ బ్లాస్టర్ అని పిలుచుకునే భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్కు ఒక అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ప్రముఖ వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ యొక్క నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నాన్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడు అమోల్ కాలే మంగళవారం ప్రకటించారు. కాగా ఈ ఐకానిక్ స్టేడియంలో క్రీడాకారుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 2023 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనిని ఎంసీఏ లాంజ్ వెలుపల వృత్తాకార ప్లాట్ఫారమ్లో ఏర్పాటు చేయనున్నారు. ఇక ఎంసీఏ వాంఖడేలో సచిన్ యొక్క స్వర్ణోత్సవ సంవత్సరాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా సచిన్ టెండూల్కర్ యొక్క విగ్రహం ఏర్పాటు చేయబడుతోంది.
ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ అమోల్ కాలేతో కలిసి విలేకరులతో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఈ నిర్ణయం నాకు ఆనందాన్ని మరియు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ గొప్ప గౌరవం కలిగిస్తున్నందుకు నేను ఎంసీఏకి ధన్యవాదాలు. నా హృదయంలో ఈ మైదానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే 1998లో నా ప్రయాణం ఇక్కడే వాంఖడేలో ప్రారంభమైంది. నా మొదటి రంజీ మ్యాచ్ ఇక్కడే ఆడాను. చాలా కాలం క్రితం, నా క్రికెట్ గురువు అచ్రేకర్ సార్ నన్ను ఇక్కడ మందలించారు. అప్పటి నుండి నేను ఆట పట్ల తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఆయన శిష్యరికంలోనే నేను ఒక ప్రొఫెషనల్ క్రికెటర్గా మారాను. అలాగే నేను నా చివరి మ్యాచ్ను కూడా ఇదే వేదికపైనే ఆడాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన ప్రదేశం. ఈ మైదానంలో నాకు అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. కొన్ని మరపురానివి అయితే మరికొన్ని చేదు జ్ఞాపకాలు. జీవితం నాకు ఇక్కడ అన్నీ ఇచ్చింది, అలాగే అన్నీ నేర్పింది. నా జీవితంలో ఇది నాకు చాలా విలువైన క్షణం’ అని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా ఎంసీఏ అధ్యక్షుడు అమోల్ కాలే మాట్లాడుతూ.. 2023లో భారత్లో జరగనున్న ఐసీసీ ప్రపంచ కప్ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. ఎందుకంటే క్రికెట్కు చెందిన చాలా మంది సభ్యులు ఇక్కడకు వస్తారు. కావున దీనిని గొప్పనిర్వహించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. కాగా సచిన్ భారతదేశం తరపున 200 టెస్టులు, 463 వన్డేలు మరియు 1 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇక అన్ని ఫార్మాట్లలో కలిపి 34,357 పరుగులు చేశాడు. 100 సెంచరీలతో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో చివరిగా 2011లో వాంఖడే వేదికగా ప్రపంచ కప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE