హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మక జీ-20 సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 6, 7 తేదీల్లో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్సియల్ ఇన్క్లూజన్ (జీపీఎఫ్ఐ) పేరుతో జీ-20 సమావేశాలను కేంద్రం నిర్వహిస్తోంది. కాగా దీనికి సంబంధించిన తొలి సమావేశం జనవరిలో కోల్కతాలో నిర్వహించగా.. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో జరుగనున్నది రెండోది కావడం గమనార్హం. ఇక ఈ సమావేశాలకు జీ-20 దేశాల ప్రతినిధులతోపాటు ఇతర అంతర్జాతీయ ప్రతినిధులు కూడా హాజరవనున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్, భూటాన్, ఈజిప్ట్, ఇథియోపియా, ఘనా, జోర్డాన్, మలావి, మాల్దీవులు, నేపాల్, ఒమన్, ఫిలిప్పీన్స్, పోలాండ్, సెనెగల్, సియెర్రా లియోన్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం దేశాలు పాల్గొంటున్నాయి. అలాగే ప్రాంతీయ ఆర్థిక మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధులు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మరియు ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ వంటి సంస్థలు కూడా హారవనున్నాయి.
ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో జీ-20 ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ ష్రింగ్లా సమావేశ వివరాలను వెల్లడించారు. ఆయనతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు చంచల్ సర్కార్ కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ ష్రింగ్లా మాట్లాడుతూ.. జీ-20 ఇండియా ప్రెసిడెన్సీ కింద గ్లోబల్ పార్టనర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ (జీపీఎఫ్ఐ) రెండో సమావేశం మార్చి 6-7 తేదీల్లో హైదరాబాద్లో జరుగుతుందని, సమావేశానికి ముందుగా గ్లోబల్ సౌత్లోని ఎమర్జింగ్ ఎకానమీల కోసం నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ మార్చి 4 నుండి 6 వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. ఇక మార్చి 6న చెల్లింపులు మరియు రెమిటెన్స్లలో డిజిటల్ ఆవిష్కరణలపై జీపీఎఫ్ఐ సింపోజియం జీ-20 మరియు జీ-20యేతర దేశాలు రెండింటికీ కూడా నిర్వహించబడుతుందని హర్షవర్ధన్ వివరించారు.
ట్రాన్స్నేషనల్ డిజిటల్ చెల్లింపుల ఇంటర్ ఆపరేబిలిటీపై అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్తు ప్రణాళిక, జీ-20 యేతర దేశాల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఇక రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ వ్యవస్థలు మరియు దేశాలకు కోవిడ్ మహమ్మారి గొప్ప షాక్ అని, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాయని హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఇంకా ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు డిపిఐ-డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ)ని ఉపయోగించుకోవడం ద్వారా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ల్యాండ్స్కేప్ను మార్చడంలో ఆలోచనలను పంచుకుంటారని ఆయన వివరించారు. ఈ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ యాక్షన్ ప్లాన్ అభివృద్ధితో సహా 2023 సంవత్సరానికి సంబంధించిన ముఖ్యమైన డెవలప్మెంట్పై చర్చలను ముందుకు తీసుకువెళుతుందని, అలాగే 2024-26 ఆర్థిక సంవత్సరానికి మార్గనిర్దేశం చేస్తుందని ఆశిస్తున్నామని హర్షవర్ధన్ ష్రింగ్లా అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE