ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు ఆందోళన చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ఆఖరి రోజు కూడా టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. స్పీకర్ తమ్మినేని టీడీపీ సభ్యులను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. కాగా అంతకుముందు ప్రశ్నోత్తరాల్లో భాగంగా నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్లలో భాగంగా 30 లక్షల మందికి ఇంటి స్ధలాలు కేటాయించామని, అయితే గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల ద్వారా ఆ పార్టీ నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ మల్లాది విష్ణు ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
ఈ క్రమంలో సభలో ఆందోళనకు దిగిన వారు పోడియం వైపు దూసుకెళ్లి నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు నేటీతో అసెంబ్లీ సమవాశాలు ముగియనున్న నేపథ్యంలో 2021-22 కాగ్ రిపోర్ట్ను రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈరోజు ద్రవ్యవినిమయ బిల్లు సహా మొత్తం ఐదు బిల్లులకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. అలాగే సభలో రెండు తీర్మానాలకు జగన్ సర్కార్ ఆమోద ముద్ర వేయనుంది. బోయ, వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం పంపనుంది. వీటితో పాటు కన్వర్టడ్ క్రిస్టియన్స్కు ఎస్సీ హోదా కొనసాగించాలని కోరుతూ కేంద్రానికి ఏపీ శాసనసభ తీర్మానం పంపించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE