ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఏప్రిల్ 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన ఎమ్మెల్యేలు, అన్ని నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కాగా రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ గురువారం ఉదయం తన పర్యటనను ముగించుకుని ఏపీకి చేరుకున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరియు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సమావేశం నిర్వహిస్తుండటం ఆసక్తికగా మారింది.
ఇక ఈ భేటీలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం. అలాగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగా ఇప్పటినుంచే పార్టీని సన్నద్ధం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు, అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ అనూహ్యంగా 4 స్థానాలు గెలుచుకోవడం తదనంతర పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచన చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలపై కేడర్ను సమాయత్తం చేసేందుకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE