బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం సోమవారం ప్రకటించింది. గత కొంతకాలంగా ఈ ఇరువురు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో.. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు వారిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉమ్మడి ఖమ్మంలో వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వరుసగా మూడోసారి కూడా గెలిచి ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నారని, అయితే ఆయనపై పోరాటానికి వ్యతిరేక శక్తులన్ని ఏకం అవుతాయని ప్రకటించారు. ఇక ఈ సమావేశం ముగిసిన తర్వాతి రోజే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడం గమనార్హం. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరుగనుండగా.. క్రమశిక్షణ ఉల్లంఘించే వారిని ఉపేక్షిస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని భావించిన బీఆర్ఎస్ అధిష్టానం ఈ పరిణామాల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇక సస్పెన్షన్ వేటు పడటంతో ఈ ఇరువురు నేతలు ఏ పార్టీలో చేరుతారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే కాంగ్రెస్, బీజేపీలలో ఎదో ఒక పార్టీలో చేరొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE