ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 16, గురువారం ఉదయానికి కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 534 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 154 ప్రాంతాలను కరోనా కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించామని చెప్పారు. అలాగే వచ్చే వారం రోజుల్లో కరోనా నిర్ధారణ పరీక్షల సామర్ధ్యాన్ని 15వేల నుంచి 17వేలకు పెంచాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు. కరోనా బాధితుల చికిత్స కోసం తగిన ఆస్పత్రులతో పూర్తి సన్నద్ధతతో ఉన్నామని, ఒకవేళ రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగితే క్వారంటైన్ కేంద్రాలను కూడా కోవిడ్-19 కేర్ సెంటర్లుగా మారుస్తామని జవహర్రెడ్డి పేర్కొన్నారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 12వేలకు పైగా కరోనా వైద్య పరీక్షలు నిర్వహించామని, ఏప్రిల్ 20వ తేదీ నాటికి మరోసారి పరిస్థితులను సమీక్షించి మండలాలను మళ్లీ రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లుగా చేస్తామని తెలిపారు. కంటైన్మెంట్ క్లస్టర్లలలో ప్రత్యేక నిఘాతో యధావిధిగా లాక్డౌన్ కొనసాగుతుందని చెప్పారు. ఏఎన్ఎం లు, ఆశావర్కర్లు రాష్ట్రంలో మూడు పేజ్ లలో ఫీవర్ సర్వే ద్వారా గుర్తించిన 32వేలకు పైగా అనుమానితులకు కూడా వారంలోగా కరోనా పరీక్షలు చేస్తామని చెప్పారు. కరోనా కారణంగా ఇతర ఓపీ సేవలకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన టెలీమెడిసిన్ కార్యక్రమం ద్వారా ఎవరైనా వైద్యసేవలు పొందవచ్చని జవహర్రెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu