ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ ను నిలిపివేస్తున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏప్రిల్ 16, గురువారం నాడు అధికారికంగా ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చేంత వరకు ఐపీఎల్-2020 వాయిదా వేస్తున్నామని బీసీసీఐ సెక్రటరీ జై షా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వలన ప్రజల ఆరోగ్యంపై ఆందోళన కలిగిఉండడం, మరియు కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తూ చర్యలకు తీసుకుంటుండడం వలన ఐపీఎల్-2020 సీజన్ను నిలిపివేయాలని బీసీసీఐ యొక్క ఐపీఎల్ పాలక మండలి నిర్ణయించింది. దేశంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులు మరియు భద్రతతో పాటుగా ఐపీఎల్ లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడును ప్రధాన ప్రాధాన్యతగా భావిస్తున్నాం. బీసీసీఐతో పాటు ఫ్రాంచైజ్ యజమానులు, బ్రాడ్కాస్టర్, స్పాన్సర్లు, అందరూ వాటాదారులు సురక్షిత వాతావరణం నెలకొన్నప్పుడే ఐపీఎల్-2020 సీజన్ను నిర్వహించాలని, అదే సముచితమని అంగీకరించారని ప్రకటనలో పేర్కొన్నారు.
ఐపీఎల్-2020 తదుపరి ప్రారంభ తేదీని ప్రకటించేందుకు బీసీసీఐ తన వాటాదారులందరితో కలిసి పరిస్థితిని పర్యవేక్షించడం మరియు సమీక్షించడం చేస్తుంది. అలాగే భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర రాష్ట్ర నియంత్రణ సంస్థల నుండి మార్గదర్శకత్వం తీసుకుని ముందుకు వెళతామని జై షా ప్రకటించారు. ముందుగా షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్-2020 మార్చ్ 29 నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా, దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏప్రిల్ 15కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తదుపరి ప్రకటన వచ్చేంత వరకు ఐపీఎల్-2020 నిలిపివేస్తున్నట్టు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.