టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. గడచిన మూడు వారాలుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమించి శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు, నందమూరి, నారా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో ప్రారంభమైన యువగళం పాదయాత్రలో తొలిరోజు పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు వచ్చింది. దీంతో ప్రాథమిక చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి ఆ తర్వాత కుప్పంలోని ప్రముఖ పీఈఎస్కు తరలించారు. అయితే ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో అదేరోజు అర్ధరాత్రి కుప్పం నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.
అప్పటినుంచి 23 రోజులుగా అక్కడ ఆయనకు విదేశీ వైద్య నిపుణులను రప్పించి మరీ చికిత్స అందించారు. అయితే వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఈ క్రమంలో బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తారకరత్న శనివారం తుదిశ్వాస విడిచారు. దీంతో తారకరత్న పార్థివ దేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. నగరంలోని మోకిలలోని తన స్వగృహానికి తారకరత్న భౌతిక కాయాన్ని తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఫిలిం ఛాంబర్లో తారకరత్న పార్థివ దేహాన్ని ఉంచనున్నారు.
ఇక తారకరత్న మృతి పట్ల టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ తదితరులు నివాళులు అర్పించారు. తారకరత్న మృత్యువుతో పోరాడారని, చివరికి తమకు దూరమై కుటుంబానికి విషాదాన్ని మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు.. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన మృతి తమ కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని లోకేష్ అన్నారు.
ఇక తారకరత్న మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు అర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మహేశ్ బాబు, రవితేజ, నాగశౌర్య, అల్లరి నరేశ్ తదితరులు సంతాపం ప్రకటించారు. అలాగే తెలంగాణ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపారు. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, రావుల చంద్రశేఖరరెడ్డి, బక్కిన, అర్వింద్ కుమార్ గౌడ్ సంతాపం వెలిబుచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE