అమూల్ సంస్థలో.. పాలు పోసే రైతులే యజమానులు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ‘జగనన్న పాలవెల్లువ’ కార్యక్రమం ఈ రోజు కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే, ఇప్పటికే ఐదు జిల్లాల్లో పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభమైంది. అమూల్ సంస్థ.. ప్రకాశం, చిత్తూరు, కడప, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల నుంచి పాలను సేకరిస్తోంది. పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు.
“జిల్లా వ్యాప్తంగా 264 గ్రామాల్లో ‘జగనన్న పాలవెల్లువ’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇదొక చారిత్రాత్మక ఘట్టం. జిల్లాలోని రైతులకు, అక్కాచెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా మరింత మెరుగైన ధర లభిస్తుంది. ఇతర డైరీలతో పోల్చితే అమూల్ అదనంగా పది కోట్లు ఇచ్చింది. మిల్క్ ప్రాసెసింగ్లో దేశంలోనే అమూల్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అమూల్ పాల సేకరణ ధర మిగిలిన వాటికన్నా ఎక్కువ. ప్రపంచంలో అమూల్ ఎనిమిదో స్థానంలో ఉంది. అందుకే, అధికారంలోకి రాగానే అమూల్తో ఒప్పందం చేసుకుని పాల సేకరణ చేపట్టాం” అని సీఎం అన్నారు.
“కేవలం పది రోజుల్లోనే పాల బిల్లు రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. మహిళా సాధికారతకు అత్యధికంగా ప్రాధాన్యతనిస్తున్నాం. ఏడాదిలో 182 రోజులు సొసైటీకి పాలు పోసిన రైతులకు బోనస్ కూడా లభిస్తుంది. లీటర్కు 50 పైసలు చొప్పున బోనస్ ఇస్తారు. ప్రభుత్వ సహకార డెయిరీలకు ఆర్థిక పరిపుష్టి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న పాలవెల్లువ పథకం ద్వారా పాలకు గిట్టుబాటు ధర, పాడి రైతుకు ఆర్థిక భరోసా లభిస్తోంది” అని సీఎం జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ