ఒంగోలు నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడంతో మరోసారి కఠిన నిబంధనలు అమలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఒంగోలు నగరంలో ఇప్పటివరకు పరిమిత ఆంక్షలు అమల్లో ఉండగా, కొన్ని రోజుల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ రోజు (ఆగస్టు 12, బుధవారం) నుంచి రెండువారాల పాటు ఒంగోలులో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలుకానుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్ షాపులు, ప్రభుత్వ కార్యాలయాలు మినహా మిగిలిన ఎలాంటి షాపులు తెరవడానికి గాని, ఇతర కార్యకలాపాలకు గాని అనుమతి లేదని చెప్పారు.
నిత్యావసర వస్తువుల కొనుగోలు నిమిత్తం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. లాక్డౌన్ సందర్భంగా నిబంధనలు అతిక్రమించకుండా, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా అధికారులకు సహకరించాలని జిల్లా యంత్రాంగం కోరింది. మరోవైపు ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 9328 కి చేరింది. జిల్లాలో ఇప్పటికే కరోనా నుంచి కోలుకుని 5803 మంది డిశ్చార్జ్ అవ్వగా, 129 మంది మరణించారు. ప్రస్తుతం 3396 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu