ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 30వ రోజుకు చేరుకున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ మూడు సార్లు సమావేశమై రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలపై చర్చించింది. ఈ నేపథ్యంలో రైతులు తమ సమస్యలను సిఆర్డిఎ కమిషనర్కు తెలుపవచ్చని రాష్ట్ర రవాణ, సమాచార శాఖ మంత్రి, హైపవర్ కమిటీ సభ్యులు పేర్ని నాని పేర్కొన్నారు. ఆ దిశగా రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందుకోసం తుళ్లూరులోని సిఆర్డిఎ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు.
రైతులు రాజధాని అంశంపై తమకున్న అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలుపవచ్చని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటి వరకూ 3000 మందికి పైగా రైతులు తమ అభిప్రాయాలను తెలిపినట్లుగా అధికారులు పేర్కొన్నారు. అలాగే ఈ నెల 17వ తేదీ వరకు రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. హైపవర్ కమిటీ జనవరి 17న మరోసారి భేటీ అయ్యి రాజధాని నివేదికలు, రైతుల అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో చర్చించి తుదినివేదికను రూపొందించనున్నారు.
[subscribe]