ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో వేతన సవరణపై చర్చలు విఫలమైన తర్వాత బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చాయి. జనవరి 31 మరియు ఫిబ్రవరి 1న సమ్మెకు పిలుపునిస్తునట్టు బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు ప్రకటించాయి. తొమ్మిది కార్మిక సంఘాలకు ప్రాతినిధ్య వహిస్తున్న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యుఎఫ్బీయూ) జనవరి 13, సోమవారం నాడు ఐబీఏతో చర్చలు జరిపారు. వేతన సంబంధిత డిమాండ్లు, స్పెషల్ అలవెన్స్ను బేసిక్ పేలో కలపడం, కొత్త పెన్షన్ పథకాన్ని రద్దు చేయడం, పనిదినాలు, పని గంటలు వంటి డిమాండ్లతో సాగిన చర్చలు విఫలం కావడంతో యుఎఫ్బీయూ అసంతృప్తి వ్యక్తం చేసింది.
యుఎఫ్బీయూ జనరల్ సెక్రటరీ దేబశిష్ బసు చౌదరి మాట్లాడుతూ ఐబీఏ ఆఫర్లపై తమ సంఘాలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. వేతన సంబంధిత అంశాలపై అంగీకారం కుదరక పోవడంతో సమ్మెలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఐబీఏ తమ డిమాండ్లను అంగీకరించకపోతే ప్రకటించిన రెండ్రోజుల సమ్మెతో పాటుగా మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజులపాటు సమ్మె చేస్తామని యుఎఫ్బీయూ హెచ్చరించింది. అప్పటికీ డిమాండ్లు నెరవేరని పక్షంలో ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో రెండోసారి బడ్జెట్ను సమర్పించనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజునే బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతుండడంతో ఈ సమ్మెకు ప్రాధాన్యత సంతరించుకుంది.
[subscribe]